మునుగోడు ఉపఎన్నికలో కీలకమైన పోలింగ్ రోజున కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా మార్ఫింగ్ చేసిన ఫోటోలతో పాల్వాయి స్రవంతిని టార్గెట్ చేస్తున్నారు. ఇక ఈ ప్రచారం మునుగోడులో ఉప ఎన్నికల పోలింగ్ పై పడుతుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పాల్వాయి స్రవంతిపై దుష్ప్రచారం.. స్పందించిన స్రవంతి, రేవంత్ రెడ్డి అయితే ఈ ప్రచారం పై స్పందించిన పాల్వాయి స్రవంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తానూ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పని చేస్తున్నానని స్పష్టం చేశారు. ఓటర్లను గందరగోళానికి గురి చేసి ఓట్లు పడకుండా చెయ్యాలనే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. కాగా పాల్వాయి స్రవంతి పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు.
ఫేక్ పార్టీ బీజేపీ దుష్ప్రచారం అంటూ భగ్గ్గుమన్న రేవంత్ రెడ్డి దుబ్బాక తరహాలోనే మునుగోడులో ఫేక్ పార్టీ అయిన బిజెపి సోషల్ మీడియాలో బరితెగించిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి, మునుగోడు ఆడబిడ్డ పాల్వాయి స్రవంతి పై మార్పింగ్ ఫోటోలతో దుష్ఫ్రచారం బిజెపి నాయకులు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఓటమి ఖాయం అన్న భయం ఉన్న వాళ్లే ఇలాంటి నీచానికి దిగజారుతారు అంటూ రేవంత్ రెడ్డి భగ్గుమన్నారు.