సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్లో భాగంగా పాకిస్తాన్ ఇవ్వాళ లైఫ్ అండ్ డెత్ మ్యాచ్ ఆడబోతోంది. తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ను ఢీ కొట్టడానికి సమాయాత్తమౌతోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. అదృష్టం కొద్దీ సెమీ ఫైనల్స్లోకి అడుగుపెట్టిన పాకిస్తాన్.. న్యూజిలాండ్తో ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది. న్యూజిలాండ్కు అతిపెద్ద అడ్డంకిగా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
నక్కతోక తొక్కి..
పాకిస్తాన్ క్రికెట్ను అనిశ్చితికి మారుపేరుగా చెబుతుంటారు. ఆ పేరును నిలబెట్టుకుంది పాకిస్తాన్. అనూహ్యంగా సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది. సూపర్ 12 దశలో దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ చిత్తు చేయడంతో అదృష్టవశాత్తూ పాకిస్తాన్ సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోతుందని ఎవ్వరూ ఊహించివుండరు. అలాంటి అద్భుతం చోటు చేసుకోవడంతో సెమీస్ రేసు నుంచి దక్షిణాఫ్రికా వైదొలగింది. దాని స్థానంలో పాకిస్తాన్ ఆ ఛాన్స్ను అందిపుచ్చుకుంది.