టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్లో భాగంగా గురువారం భారత క్రికెట్ జట్టు సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. అడిలైడ్ ఓవల్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇంగ్లాండ్తో జరిగే పోరు ఇది. ఈ రెండు జట్లు కూడా ఫైనల్ మ్యాచ్పై కన్నేశాయి. సెమీస్లో విజయం సాధించడానికి చెమటోడుస్తోన్నాయి. నెట్స్లో శ్రమిస్తోన్నాయి. గెలిచిన జట్టు- ఇవ్వాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్లో పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి సెమీ ఫైనల్ విజేతతో ఈ నెల 13వ తేదీన ఫైనల్లో తలపడుతుంది.
ఈ నేపథ్యంలో- టీమిండియా కేప్టెన్ రోహిత్ శర్మ విలేకరులతో మాట్లాడాడు. అడిలైడ్ ఓవల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలను ప్రస్తావించాడు. తుదిజట్టు గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. సెమీ ఫైనల్ ఆడే జట్టులో ఏదైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే- దినేష్ కార్తీక్, రిషభ్ పంత్ ఇద్దరినీ ఆడించే అవకాశాలు లేకపోలేదని వ్యాఖ్యానించాడు. ఒకట్రెండు మ్యాచ్లను ఆధారంగా చేసుకుని ప్లేయర్ ప్రతిభను అంచనా వేయడం సరికాదని స్పష్టం చేశాడు.